Andhra Pradesh: ఏపీకి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయి.. రేపు సాక్ష్యాలతో సహా బయటపెడతా!: సినీ నటుడు శివాజీ

  • జ్యోతుల నెహ్రూకు మద్దతుగా ఎన్నికల ప్రచారం
  • టీడీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని వ్యాఖ్య
  • మోదీ చేతిలో ఈసీ కీలుబొమ్మగా మారిపోయిందని విమర్శ

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజక వర్గం టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూకు మద్దతుగా ప్రముఖ సినీ నటుడు శివాజీ ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీలో టీడీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు వ్యతిరేకంగా ఇప్పుడు చాలా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ నాలుగు రోజుల్లో కుట్రలు మరింత పెరిగాయని వ్యాఖ్యానించారు.

ఈ కుట్రలకు సంబంధించిన వివరాలను రేపు మీడియా ముందు బయటపెడతానని తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) పునేఠాను మార్చడంపై శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎస్ ను మార్చడం కంటే దారుణం ఇంకేం ఉంటుందని ప్రశ్నించారు. ఇది కచ్చితంగా మోదీ కుట్రేనని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా మోదీ చేతిలో కీలుబొమ్మగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News