Chandrababu: అదే తెలుగోడి సత్తా... నాకెంతో గర్వంగా ఉంది: సివిల్స్ ర్యాంకులపై చంద్రబాబునాయుడు

  • సివిల్స్ కు ఎంపికైన వారిలో 40 మంది తెలుగువారు
  • అభినందనలు తెలిపిన ఏపీ సీఎం
  • అందరినీ సత్కరించాలని అధికారులకు సూచన

నిన్న ప్రకటించిన యూపీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభినందనలు తెలిపారు. వీరంతా తెలుగోడి సత్తాను మరోసారి దేశానికి చాటి చెప్పారని, ఈ క్షణం తనకెంతో గర్వంగా ఉందని ఆయన అన్నారు. అఖిల భారత సర్వీసులకు ఎంపికైన తెలుగు యువతీ, యువకులను అమరావతికి ఆహ్వానించి సత్కరించాలని అధికారులకు సూచించిన చంద్రబాబు, దేశానికి అత్యున్నత స్థాయి అధికారులను అందిస్తున్న ఘనత తెలుగువారిదేనని అన్నారు.

ఉగాది పర్వదిన శుభవేళ, తెలుగు యువత సాధించిన విజయాలు ప్రతి ఒక్కరికీ ప్రేరణ కావాలని కోరుకుంటున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సివిల్స్ కు ఎంపికైనవారిలో 40 మంది వరకూ తెలుగువారు ఉన్నారని గుర్తు చేసిన ఆయన, ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, ప్రజలకు సమర్థవంతమైన సేవలనందించాలని పిలుపునిచ్చారు.

More Telugu News