Hyderabad: కూకట్‌పల్లిలో దారుణం.. భర్త, అత్తమామల వేధింపులు తట్టుకోలేక భవనం పైనుంచి దూకిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్!

  • పెళ్లైన ఆరు నెలల నుంచే వేధింపులు
  • విడాకుల నోటీసు పంపిన భర్త
  • ప్రశ్నించేందుకు వెళ్లి 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య

పెళ్లయిన ఆరు నెలలకే భర్త, అత్తమామల నుంచి వేధింపులు తీవ్రం కావడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ భవనం పై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో శుక్రవారం రాత్రి జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. హైదర్‌నగర్‌లోని భవ్యాస్ అఖిల ఎగ్జోటికా అపార్ట్‌మెంట్‌లో వినయ్ కుమార్-మేఘన దంపతులు నివసిస్తున్నారు.

రెండేళ్ల క్రితమే వీరికి వివాహం కాగా, పెళ్లైన ఆరు నెలల నుంచే అత్తింటి నుంచి వేధింపులు మొదలయ్యాయి. తల్లిదండ్రులతో కలిసి భర్త పెట్టే వేధింపులు భరించలేని ఆమె కొన్ని రోజుల క్రితం మైత్రినగర్‌లోని తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఉంటోంది.

ఈ క్రమంలో శుక్రవారం భర్త వినయ్ కుమార్ నుంచి విడాకుల నోటీసు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మేఘన రాత్రి వాటిని తీసుకుని భర్త వద్దకు వచ్చింది. విడాకుల నోటీసు విషయంలో భర్త, అత్తమామలతో గొడవ పడింది. ఈ క్రమంలో 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News