Telangana: మన దమ్మేంటో తెలియజెప్పండి. .కేసీఆర్, నామాలకు నామాలు పెట్టండి: రేణుకాచౌదరి

  • ఖమ్మం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట
  • ఇక్కడ కేసీఆర్ ఆటలు సాగవు
  • నామాకు ఓట్లేస్తే ప్రజలకు నామాలు పెడతాడు

సీఎం కేసీఆర్, ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై కాంగ్రెస్ పార్టీ మహిళా నేత రేణుకా చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న రేణుకా చౌదరి ఈరోజు  అశ్వారావుపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఖమ్మం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని, ఇక్కడ కేసీఆర్ ఆటలు సాగవని అన్నారు.

నామా నాగేశ్వరరావుకు ఓట్లేస్తే ప్రజలకు నామాలు పెడతారని విమర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, కేసీఆర్ కు, నామాకు నామాలు పెట్టి వెనక్కి పంపాలంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, టీడీపీల దమ్ము ఏంటో కేసీఆర్ కు, దేశానికి తెలియాలంటే తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే జామాయిల్, పామాయిల్, సుబాబుల్ రైతులకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

More Telugu News