saipratap: వారిద్దరి దారీ అటువైపే.. వైసీపీలో చేరనున్న సాయిప్రతాప్‌, హర్షకుమార్‌

  • రేపు జగన్‌ సమక్షంలో పార్టీలో చేరనున్న నేతలు
  • కేంద్ర మాజీ మంత్రి సాయి, వైఎస్‌కు అత్యంత సన్నిహితుడు
  • అమలాపురం మాజీ ఎంపీ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు

కడప సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్‌, అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. ఇద్దరు టీడీపీ నాయకులు ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వీరి అడుగులు వైసీపీ వైపే అని రాజకీయవర్గాలు ఊహించినట్టే వీరిద్దరూ గురువారం పార్టీ అధినేత జగన్‌ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు. సాయిప్రతాప్‌ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితుడు. అనుకోని పరిస్థితుల్లో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ అక్కడ ఇమడలేక ఇబ్బందులు పడ్డారని సన్నిహితులు అంటున్నారు.

ఈ ఎన్నికల్లో రాజంపేట ఎంపీ టికెట్టు ఆశించిన ఆయనకు అధిష్ఠానం మొండిచెయ్యి చూపింది. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయం అన్న మాటలు అప్పుడే వినిపించాయి. అనుకున్నట్టే కొద్దిరోజుల క్రితం టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. తాజాగా వైసీపీ గూటిలో చేరాలని నిర్ణయించారు.

ఇక, అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకుడు. ఎన్నికల ముందే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. అమలాపురం ఎంపీ టికెట్టు ఆశించి ఆ పార్టీలో చేరిన హర్షకుమార్‌ ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లారు. ఆ స్థానాన్ని లోక్‌సభ మాజీ స్పీకర్‌ జి.ఎం.సి.బాలయోగి కొడుకు హరీశ్‌కు కేటాయించారు.

దీంతో అసంతృప్తికి గురైన హర్షకుమార్‌ వెంటనే టీడీపీకి రాంరాం చెప్పేశారు. ఈయన కూడా వైసీపీలో చేరుతారన్న ఊహాగానాలు ఇప్పుడు నిజం చేశారు. హర్షకుమార్‌తోపాటు ఆయన కొడుకు శ్రీహర్ష కూడా వైసీపీలో చేరనున్నారు.

More Telugu News