Chittoor District: ఆ ఎమ్మెల్యేకు నోటి దురుసు తప్ప, ఒక పద్ధతీపాడూ లేదు: రోజాపై చంద్రబాబు ఫైర్

  • వీళ్ల నాయకుడూ అంతే, వీళ్లూ అంతే!
  • ఆ నాయకుడు ‘నన్ను ‘420’ అంటాడా?
  • ఇలాంటి వ్యక్తులను ఇంటికి పంపించాలి

ఆ ఎమ్మెల్యే నోరు పారేసుకోవడం తప్ప నియోజకవర్గానికి చేసిందేమీ లేదని వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పరోక్ష విమర్శలు చేశారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ఆ పార్టీ అధినేత తనపై నోరుపారేసుకుంటారని, ఆ పార్టీ ఎమ్మెల్యే కూడా అదే విధంగా ప్రవర్తిస్తుందని విమర్శించారు. నోటి దురుసు తప్ప, ఒక పద్ధతీపాడూ లేదని, ఆమె ఇష్టానుసారం మాట్లాడినా తానెప్పుడూ పట్టించుకోలేదని అన్నారు. ‘వీళ్ల నాయకుడూ అంతే, వీళ్లూ అంతే’ అని జగన్, రోజాపై మండిపడ్డారు.

ఆ నాయకుడు ‘నన్ను ‘420’ అంటాడా? నన్ను చెప్పుతో కొడతానంటాడా? నన్ను నడిరోడ్డులో ఉరేస్తానంటాడా?’ అని జగన్ పై ధ్వజమెత్తారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి.. ఇలా అందరితో పోరాడిన తనను, 31 కేసులున్న ఓ నేరచరితుడు తనను మాటలంటాడా? అని విరుచుకుపడ్డారు. నగరి నియోజకవర్గ ప్రజలకు ఆమె అందుబాటులో ఉందా? ఎప్పుడైనా ఈ పని కావాలని అడిగారా? అలాంటి ఎమ్మెల్యే మనకు అవసరమా? హైదరాబాద్ లో టీవీ షోలు చేసుకోవడం తప్ప, ప్రజలకు ఏం ఉపయోగపడ్డారు? అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తులను ఇంటికి పంపించాలని, మళ్లీ పోటీ చేయకుండా చేయాలని ప్రజలను కోరారు. నగరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు.

More Telugu News