Chandrababu: చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ శ్రీయాగం మొదలుపెట్టిన వంగవీటి రాధా

  • మూడు రోజుల పాటు యాగం
  • చెల్లెలితో పూజలు చేయించిన రాధా
  • రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం చంద్రబాబు సీఎం కావాలన్న టీడీపీ నేత

బెజవాడ రాజకీయనాయకుడు, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ మళ్లీ చంద్రబాబే సీఎం కావాలంటూ శ్రీయాగం చేస్తున్నారు. మూడు రోజుల పాటు కొనసాగే శ్రీయాగాన్ని రాధా తన చెల్లెలు, బావలతో చేయిస్తున్నారు. ఆదివారం ఉదయం రాధా సోదరి ఆషా, ఆమె భర్త పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మొదట గోపూజ, అనంతరం వాస్తు హోమం నిర్వహించి ఆపై శ్రీయాగం మొదలుపెట్టారు. రుత్విక్కుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యాగం ఏప్రిల్ 3న పూర్ణాహుతితో ముగుస్తుంది. శ్రీయాగం చేయడం వల్ల ప్రజలు సుఖశాంతులతో ఉంటారని, శత్రుపీడ, సంకల్పసిద్ధి జరుగుతుందని వంగవీటి రాధా తెలిపారు. రాష్ట్రాన్ని సుభిక్షం చేయాలని తపిస్తున్న చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్న కోరికతోనే ఈ యాగం చేస్తున్నట్టు వివరించారు. విజయవాడలోని కేజే గుప్తా కల్యాణమంటపంలో ఈ యాగం జరుగుతోంది.

More Telugu News