Chandrababu: విశాఖపట్నం సభలో మోదీకి సవాల్ విసిరిన మమతా బెనర్జీ

  • మోదీతో రాజకీయ యుద్ధానికి సిద్ధం
  • పేపర్లు, టెలీప్రాంప్టర్లు లేకుండా చర్చకు వచ్చే దమ్ముందా?
  • మోదీ కారణంగా దేశం నాశనం అవుతుంటే ఒప్పుకోం!

విశాఖపట్నంలో ఇవాళ ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారసభకు ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీని ఏకిపారేశారు. మోదీ కారణంగా దేశం నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. దేశానికి మోదీ, అమిత్ షాల అవసరంలేదని, వారి వల్ల దేశానికి ఒరిగిందేమీలేదని మండిపడ్డారు. తన ఐదేళ్ల పాలనలో మోదీ ఐటీ దాడులు మాత్రం చేయించగలిగారని విమర్శించారు. నోట్ల రద్దు వల్ల తీవ్రవాదం తగ్గిపోతుందని చెప్పారు, కానీ అది జరిగిందా? అని ప్రశ్నించారు.

దమ్ముంటే ప్రధాని మోదీ తనతో చర్చకు రావాలని, పేపర్లు, టెలీప్రాంప్టర్లు లేకుండా చర్చకు కూర్చోవాలని మమత ఈ సందర్భంగా సవాల్ విసిరారు. మోదీకి ఈ ఎన్నికలే చివరివని, బీజేపీకి 125 సీట్లకు మించి రావని జోస్యం చెప్పారు. మోదీతో రాజకీయ యుద్ధానికి తాను సిద్ధంగా ఉన్నానని దీదీ సభాముఖంగా స్పష్టం చేశారు.

More Telugu News