Visakhapatnam District: నేడు విశాఖకు ముగ్గురు సీఎంలు.. టీడీపీ తరపున ప్రచారం చేయనున్న మమత, అరవింద్ కేజ్రీవాల్

  • సాయంత్రం ఐదు గంటలకు మున్సిపల్ స్టేడియంలో బహిరంగ సభ
  • విశాఖ బరిలో హేమాహేమీలు
  • ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు

విశాఖపట్టణంలో నేడు ముగ్గురు ముఖ్యమంత్రులు ప్రచారం నిర్వహించనున్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలిసి విశాఖలో టీడీపీ తరపున ప్రచారం నిర్వహిస్తారు. నేటి సాయంత్రం ఐదు గంటలకు వన్‌టౌన్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న సభలో వీరు పాల్గొని ప్రసంగిస్తారు.

గత ఎన్నికల సమయంలో ఇదే స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభకు అప్పటి మిత్రపక్ష నేతలైన నరేంద్రమోదీ, పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఇప్పుడు వారి స్థానంలో మమత బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ హాజరవుతున్నారు. విశాఖపట్టణం లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరపున శ్రీభరత్, వైసీపీ నుంచి సత్యనారాయణ, జనసేన నుంచి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు. ఇక బీజేపీ నుంచి పురందేశ్వరి పోటీ పడుతున్నారు. దీంతో ఇక్కడి పోరు రసవత్తరంగా మారింది.

More Telugu News