Social Media: ‘వీ చాట్’లో ఎంతమంది మిత్రులను చేసుకుంటే అన్ని మార్కులు ఇస్తామన్న ప్రొఫెసర్.. మండిపడుతున్న తల్లిదండ్రులు

  • మిత్రుల పరిధిని బట్టి మార్కులు
  • 1667 మందిని మిత్రులుగా చేసుకుంటే A+ గ్రేడ్
  • ప్రొఫెసర్‌ను వెనకేసుకొస్తున్న వర్సిటీ

సోషల్ మీడియా కారణంగా ముఖ్యంగా విద్యార్థులు చదువులు నాశనం చేసుకుంటున్నారని తల్లిదండ్రులు మొత్తుకుంటుంటే, ఓ ప్రొఫెసర్ విద్యార్థులకు ఇచ్చిన అసైన్‌మెంట్ చర్చనీయాంశంగా మారింది. చైనాలోని హనెన్ యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ లాలో ఆన్‌లైన్ అండ్ న్యూ మీడియా కోర్సును నిర్వహిస్తున్నారు. ఈ విద్యార్థులకే వర్సిటీ ప్రొఫెసర్ వింత అసైన్‌మెంట్ ఇచ్చారు. ప్రతి విద్యార్థి సోషల్ మీడియా యాప్ ‘వీ చాట్‌’లో ఎంత ఎక్కువ మందిని మిత్రులుగా చేసుకుంటే.. అన్ని మార్కులు వేస్తానని చెప్పారు.

మిత్రుల పరిధిని బట్టి మార్కులను కూడా నిర్ణయించారు. 1667 మందిని మిత్రులుగా చేసుకుంటే ఏ ప్లస్ గ్రేడ్ ఇస్తానని, 1001 మందిని మిత్రులుగా చేసుకుంటే 100కు 60 మార్కులు ఇస్తానని తెలిపారు. ఈ విషయం కాస్తా బయటకు తెలియడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆన్‌లైన్ కోర్సులో ఇదీ ఒక భాగమని యూనివర్సిటీ తమ ప్రొఫెసర్‌ను వెనకేసుకు రావడం విశేషం. ఈ అసైన్‌మెంట్‌ను కొందరు విద్యార్థులు అవలీలగా చేస్తుంటే, మరికొందరు విద్యార్థులు అసైన్‌మెంట్ చేయలేక నానా ఇబ్బందులు పడుతున్నారు.  

More Telugu News