Chandrababu: చంద్రబాబును మరోసారి టార్గెట్ చేసిన మోత్కుపల్లి!

  • తెలంగాణలో టీడీపీ భూస్థాపితం
  • దీనికి కారణం చంద్రబాబే
  • ఇప్పుడు ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారన్న మోత్కుపల్లి

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఎంతమాత్రమూ ప్రాతినిధ్యం లేకపోవడానికి, రాష్ట్రంలో పార్టీ భూస్థాపితం కావడానికి కారణం చంద్రబాబునాయుడేనని ఆ పార్టీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు నిప్పులు చెరిగారు. హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, చంద్రబాబు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసేందుకు చూస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబు అవినీతి, అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని మోత్కుపల్లి డిమాండ్‌ చేశారు. చంద్రబాబు మోసం, వెన్నుపోటు తదితరాలతోనే తెలంగాణ నుంచి టీడీపీ మాయమైందని అన్నారు. ఒకప్పుడు టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్న తెలంగాణలో, అదే పార్టీకి ఇప్పుడీ పరిస్థితి వస్తుందని తాను ఎన్నడూ అనుకోలేదన్నారు. పార్టీ కోసం తన జీవితాన్నే ధారపోశానని, విభజన తరువాత టీడీపీ జాతీయ పార్టీగా ఉంటుందని భావిస్తే, కేసుల్లో ఇరుక్కున్న చంద్రబాబు పారిపోయారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో టీడీపీని నమ్ముకుని మిగిలున్న ఒకరిద్దరు నాయకులు ఏమైపోవాలని ప్రశ్నించారు. మాల, మాదిగలకు ఏమీ చేయని చంద్రబాబు ఇప్పుడు కాపులకు ఏం చేస్తారని ప్రశ్నించారు.

More Telugu News