YS Viveka: ఆదినారాయణరెడ్డిని చంద్రబాబు ఎందుకు కాపాడుతున్నారు?: వైఎస్ వివేకా కుమార్తె సునీత

  • వివేకా మృతి వెనుక ఆదినారాయణరెడ్డి కుట్ర
  • తానే స్వయంగా ఫిర్యాదు చేశానన్న సునీత
  • ఇంతవరకూ విచారించలేదని ఆరోపణ

తన తండ్రి మరణం వెనుక మంత్రి ఆదినారాయణరెడ్డి కుట్ర ఉందన్న అనుమానాలు తమకు ఉన్నాయని, ఆయన్ను మాత్రం చంద్రబాబునాయుడు కాపాడుతున్నారని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి ఆరోపించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆమె, హత్యకు సంబంధముందని సిట్ భావిస్తున్న వారిలో పలువురికి ఎమ్మెల్సీ బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డితో సన్నిహిత సంబంధాలున్నాయని అన్నారు.

తాను చెప్పినట్టుగా పనిచేస్తున్నారు కాబట్టే ఆదినారాయణ రెడ్డిని బాబు కాపాడుకుంటూ వస్తున్నారా? అని ప్రశ్నించారు. తన తండ్రి హత్య తరువాత ఎన్నో సమాధానాలు లేని ప్రశ్నలు వెంటాడుతున్నాయని ఆమె అన్నారు. కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని, హత్య జరిగిన వెంటనే అక్కడ చేయాల్సిన తన విధులను సీఐ చేయలేదని, ఎవరి ఆదేశాల మేరకు ఆయన చూస్తుండిపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు.

సిట్ అధికారులు తమను ఎన్నో ప్రశ్నలు అడిగారని, అన్నింటికీ సమాధానం ఇచ్చామని చెప్పిన ఆమె, తాను స్వయంగా ఆదినారాయణరెడ్డిపై ఫిర్యాదు చేసినా, ఇంతవరకూ ఆయన్ను విచారించలేదని, సిట్ సైతం టీడీపీ అధీనంలోనే పనిచేస్తోందని ఆరోపించారు.

More Telugu News