Errabelli: అదే సెంటిమెంట్ పనిచేస్తే కేసీఆరే కాబోయే ప్రధాని: ఎర్రబెల్లి జోస్యం!

  • గతంలో ఆజంజాహి మైదానంలో పీవీ సభ
  • ఆపై ఆయన ప్రధాని అయ్యారు
  • ఏప్రిల్ 2న అదే మైదానంలో కేసీఆర్ సభ
  • 16 సీట్లలో గెలిస్తే కేసీఆర్ ను ప్రధానిని చేయవచ్చన్న ఎర్రబెల్లి

"వరంగల్ లోని ఆజంజాహి మైదానానికి ఓ సెంటిమెంట్ ఉంది. గతంలో ఇక్కడ భారీ బహిరంగ సభను నిర్వహించిన పీవీ నరసింహారావు ఆ తరువాత దేశానికి ప్రధాని అయ్యారు. ఇప్పుడు అదే సెంటిమెంట్ పనిచేస్తే, వచ్చే నెల 2న ఆజంజాహి మైదానంలో సభ నిర్వహించే కేసీఆర్ కూడా ప్రధాని అవుతారు" అని తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జోస్యం చెప్పారు.

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 2న జరిగే సభకు భారీ ఎత్తున జన సమీకరణను లక్ష్యంగా పెట్టుకున్న ఎర్రబెల్లి, సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 16 స్థానాల్లో టీఆర్ఎస్ గెలిస్తే, కేసీఆర్ ను ప్రధాని సీట్లో కూర్చోబెట్టే అవకాశాలు పుష్కలమని అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎంల కోసం జాతీయ పార్టీల నేతలు హైదరాబాద్ కు వచ్చి కూర్చునే పరిస్థితిని తేవాలని అన్నారు. ఎర్రబెల్లి వెంట టీఆర్ఎస్ వరంగల్ అభ్యర్థి దయాకర్, ఎమ్మెల్యేలు నరేందర్, వినయ్ భాస్కర్, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తదితరులు ఉన్నారు.

More Telugu News