Kambhampati Rammohan Rao: వైసీపీ చెప్పింది, బీజేపీ చేయిస్తోంది... ఇంతకన్నా సాక్ష్యం కావాలా?: పోలీస్ బాసుల బదిలీపై కంభంపాటి రామ్మోహన్

  • ఎన్నికలతో ఇంటెలిజెన్స్ డీజీకి సంబంధమేంటి?
  • వైసీపీ, బీజేపీ కుమ్మక్కై ఈసీపై ఒత్తిడి
  • కనీస విచారణ కూడా జరపలేదన్న కంభంపాటి
  • న్యాయపరంగా ఎదుర్కొంటామని హెచ్చరిక

బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల కుట్రలో భాగంగానే ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావును బదిలీ చేశారని తెలుగుదేశం ఎంపీ కంభంపాటి రామ్మోహన్ నిప్పులు చెరిగారు. ఈ ఉదయం అమరావతిలో కుటుంబరావుతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన, కేంద్ర ఎన్నికల సంఘం పంపిన లేఖలో బదిలీకి కారణాలను ప్రస్తావించలేదని గుర్తు చేశారు. వాస్తవానికి ఇంటెలిజెన్స్ డీజీకి ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పాత్ర ఉండదని, ఆయన కేవలం చంద్రబాబు భద్రతను పర్యవేక్షించే ప్రధాన బాధ్యతలను మాత్రమే పోషిస్తుంటారని కంభంపాటి వ్యాఖ్యానించారు. వైసీపీ, బీజేపీలు కుమ్మక్కై ఎలక్షన్ కమిషన్ పై ఒత్తిడి తెచ్చి అధికారులను బదిలీ చేయించారని, ఆ రెండు పార్టీలూ కలిసి రాష్ట్రంపైనా, తెలుగుదేశం పార్టీపైనా కుట్రలు చేస్తున్నాయనడానికి ఇంతకన్నా సాక్ష్యం అవసరం లేదని అన్నారు.

కనీస విచారణ కూడా చేయకుండా అధికారులను బదిలీ చేయడం ఏంటని ప్రశ్నించిన ఆయన, ఇటువంటి ఏకపక్ష బదిలీ రాజకీయ ప్రేరేపిత కుట్రేనని అన్నారు. ఈ కుట్రలో కేసీఆర్ కు కూడా భాగం ఉందని, బదిలీలను తమ పార్టీ ఖండిస్తోందని కంభంపాటి చెప్పారు. ఈసీ నిర్ణయాన్ని న్యాయపరంగా ఎదుర్కోవడం ద్వారా ఆ పార్టీలకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. వైఎస్ వివేకా హత్య వెనుకున్న రహస్యాలను వెలికితీస్తారన్న భయంతోనే కడప ఎస్పీని బదిలీ చేయించారని, హత్యకు సంబంధించిన విషయాలు బయటకు రాకుండా కప్పిపుచ్చేందుకే ఇలా చేశారని ఆయన విమర్శలు గుప్పించారు.

  • Loading...

More Telugu News