Chandrababu: జనసేనలో చేరిన ఎస్పీవై రెడ్డికి చంద్రబాబు తాజా ఆఫర్!

  • టీడీపీ గెలుపు కోసం ఎస్పీవై రెడ్డి సహకరించాలి
  • ముగ్గురు దుర్మార్గులతో నేను పోరాటం చేస్తున్నా
  • వైసీపీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?

దమ్ముంటే మోదీ, కేసీఆర్, జగన్ లు ముసుగులు తొలగించి రావాలని... వారికి తమ తడాఖా ఏమిటో చూపిస్తామని చంద్రబాబు అన్నారు. నంద్యాల రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, ముసుగులో గుద్దులాట వద్దని సూచించారు. రాష్ట్రంలో చిచ్చు పెట్టేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని... ఆయన ఢీ అంటే తాము కూడా ఢీ అంటామని చెప్పారు. ముగ్గురు దుర్మార్గులతో తాను పోరాడుతున్నానని అన్నారు. వైసీపీకి డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. వ్యాపారం, వ్యవసాయం చేసి జగన్ సంపాదించారా? అని అడిగారు. వైసీపీ ఖర్చు చేస్తున్నదంతా దొంగ డబ్బులని... కేసీఆర్ పంపిన డబ్బు అని విమర్శించారు.

ఇటీవల జనసేనలో చేరిన ఎంపీ ఎస్పీవై రెడ్డికి ఈ సందర్భంగా చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు. నంద్యాలలో టీడీపీ గెలుపుకు ఎస్పీవై రెడ్డి సహకరించాలని... అలాగైతే, ఆయన కుటుంబానికి గౌరవప్రదంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. కనిగిరి టీడీపీ అభ్యర్థి ఉగ్రనరసింహారెడ్డి ఆస్తులపై కావాలనే ఐటీ దాడులు చేయించారని మండిపడ్డారు.

More Telugu News