Daggubati venkateswarlu: పర్చూరు బరిలో మరో 'దగ్గుబాటి'.. వైసీపీ నేతకు కొత్త తలనొప్పి!

  • ఒకే పేరుతో బరిలో ఇద్దరు అభ్యర్థులు
  • ప్రజాశాంతి పార్టీ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర్లు పోటీ
  • కలవరపాటులో వైసీపీ నేతలు

ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు తొలి రోజు నుంచే తలనొప్పి మొదలైంది. సోమవారం ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా, కేఏ పాల్ సారథ్యంలోని ప్రజాశాంతి పార్టీ నుంచి ఒంగోలు సమీపంలోని పెళ్లకూరుకు చెందిన మరో వ్యక్తి కూడా నామినేషన్ దాఖలు చేశారు.

 ఇందులో ఎటువంటి విశేషం లేకపోయినా.. ఇద్దరి ఇంటిపేర్లు, వారి పేర్లు ఒకటే కావడంతో వైసీపీ నేతలను కలవరపరుస్తోంది. ప్రజాశాంతి పార్టీ నుంచి బరిలోకి దిగుతున్న ఆయన పేరు దగ్గుబాటి వెంకటేశ్వర్లు. అంతేకాదు.. వైసీపీ ఫ్యాన్ గుర్తు, ప్రజాశాంతి పార్టీ ఎన్నికల గుర్తు హెలికాప్టర్ ఇంచుమించు ఒకేలా ఉండడం కూడా వారిని కలవరపాటుకు గురిచేస్తోంది. పేర్లు, గుర్తులు ఒకేలా ఉండడంతో పర్చూరు వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఓట్లు ఎక్కడ చీలిపోతాయో అని భయపడుతున్నారు.

More Telugu News