జమ్మలమడుగులో 144 సెక్షన్ విధించిన పోలీసులు.. టీడీపీ, వైసీపీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ కు నేడు చివరిరోజు కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా కడప జిల్లాలో హాట్ హాట్ గా ఉన్న జమ్మలమడుగు నియోజకవర్గంలో ఈరోజు ఏపీ పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఐదుగురు మించి ఎవ్వరూ బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడకూడదని స్పష్టం చేశారు. 144 సెక్షన్ తో పాటు యాక్ట్ 30ని అమలు చేస్తున్నామని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

కడప జిల్లాలోని జమ్మలమడుగులో ఈరోజు బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలను నిషేధించామని ప్రకటించారు. అలాగే ఆర్డీవో కార్యాలయం పరిధిలో 100 మీటర్ల మేర నిషేధాజ్ఞలు విధించామని పేర్కొన్నారు. కాగా, ఈ సందర్భంగా నామినేషన్ దాఖలు చేసేందుకు వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డికి ఈరోజు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకూ పోలీసులు సమయాన్ని కేటాయించారు. టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డికి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట వరకూ సమయం ఇచ్చారు.
Go Back to Shorts
Andhra Pradesh
YSRCP
Telugudesam
Kadapa District
jammalamadugu

More Telugu News