Chiranjeevi: చిరంజీవి ఏం చెప్పబోతున్నారు?... ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ!

  • కాసేపట్లో మీడియా ముందుకు మెగాస్టార్‌
  • రాజకీయ అంశమా...సినిమాలా
  • కొన్నాళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న స్టార్‌

మెగాస్టార్‌ చిరంజీవి కాసేపట్లో మీడియా ముందుకు రానున్నారన్న సమాచారంతో ‘ఆయన ఏం చెప్పబోతున్నారు’ అనే అంశంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. ప్రజారాజ్యం పార్టీ అధినాయకునిగా, ఆ తర్వాత కాంగ్రెస్‌ నాయకునిగా, ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన మీడియా ముందుకు వచ్చి రాజకీయాలు మాట్లాడుతారా? సినిమా అంశాలు చెబుతారా? అన్న ఉత్కంఠ రేగుతోంది.

చిరంజీవి సోదరుడు పవన్‌కల్యాణ్‌ జనసేన పార్టీ ఏర్పాటుచేసి ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన సోదరుడు నాగబాబు ఇప్పటికే ఆ పార్టీ తీర్థం పుచ్చుకుని నరసాపురం లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు మరో సోదరుడు చిరంజీవి అడుగులు ఎటు వైపు? అన్న చర్చ సాగుతోంది.

ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి తదనంతర కాలంలో ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. దరిమిలా మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి పదవిని చేపట్టారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజకీయాలకు దూరమై మళ్లీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. ఖైదీ నంబర్‌ 150తో పునఃప్రవేశం చేయగా, తాజాగా 'సైరా' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి చెబుతారా? లేక తమ్ముడు పార్టీకి మద్దతు పలుకుతారా? అన్నది తెలియాల్సి ఉంది.

More Telugu News