LA Advani: అధినాయకత్వం తీరుతో అద్వానీ తీవ్ర మనస్తాపం.. సీనియర్ నేతను అవమానించారంటున్న సన్నిహితులు

  • తొలి జాబితాలో అద్వానీకి టికెట్ కేటాయించని అధిష్ఠానం
  • టికెట్ నిరాకరణ విషయంలో మాటమాత్రమైనా చెప్పని వైనం 
  • అద్వానీకి ఇష్టమైన గాంధీనగర్ నుంచి బరిలోకి అమిత్ షా

బీజేపీ నేతల తీరుతో ఆ పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ తీవ్ర మనస్తాపం చెందినట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. రెండు రోజుల క్రితం పార్టీ విడుదల చేసిన లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో అద్వానీ పేరు లేకపోవడం, ఈ విషయం గురించి తనకు మాటమాత్రమైనా చెప్పకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది.

నిజానికి తనకు టికెట్ కేటాయించనందుకు అద్వానీ బాధపడడం లేదని, కానీ ఈ విషయంలో వారి ప్రవర్తనే అద్వానీ మనస్తాపానికి కారణమని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అద్వానీకి ఎంతో ఇష్టమైన గాంధీనగర్ నియోజకవర్గం నుంచి ఈసారి ఆ పార్టీ చీఫ్ అమిత్ షా బరిలోకి దిగుతున్నారు. తనకు టికెట్ నిరాకరించిన విషయం కూడా అద్వానీకి తెలియదు. ఆ విషయం గురించి ఆయనతో ఎవరూ చర్చించకుండా అవమానించారని అద్వానీ సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాదు, జాబితా విడుదల చేసిన తర్వాత కూడా బీజేపీ పెద్దలు ఎవరూ అద్వానీతో మాట్లాడలేదని పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన తన విషయంలో సొంత పార్టీ నేతలే ఇలా అమర్యాదకరంగా ప్రవర్తించడాన్ని అద్వానీ తట్టుకోలేకపోతున్నారని, తీవ్ర మనస్తాపానికి గురయ్యారని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News