YSRCP: వైసీపీ వస్తే టీడీపీ శ్రేణులకే కాదు ప్రజలకూ రక్షణ ఎక్కడుంటుంది?: బుద్ధా వెంకన్న

  • జగన్ అధికారంలో కొస్తే అందరి ఆస్తులు ఆయన చేతుల్లోకే
  • ప్రజల సంక్షేమం గురించి జగన్ ఆలోచించరు
  • జగన్ వి బ్లాక్ మెయిల్ రాజకీయాలు  

వైసీపీ అధికారంలోకొస్తే టీడీపీ శ్రేణులకే కాదు, ప్రజలకూ రక్షణ ఎక్కడుంటుంది? అని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. తిరుపతిలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 300 మంది టీడీపీ కార్యకర్తలను హతమార్చారని అన్నారు. జగన్ లాంటి వ్యక్తికి పట్టం కడితే, అందరి ఆస్తులు జగన్ చేతుల్లోకి వెళ్లిపోతాయని విమర్శించారు. ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే వ్యక్తి కాదని అన్నారు.

ముఖ్యమంత్రి కావాలన్న కోరిక తప్ప, ప్రజలు బాగుండాలన్న ఆలోచన ఆయనకు లేదని ధ్వజమెత్తారు. జగన్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని, తెలంగాణ వాళ్లకే కాదు ఆంధ్రావాళ్లకూ పౌరుషం ఉందని, తమపై పెత్తనం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. జగన్ తన ఆస్తులను కాపాడుకోవడం కోసం కేసీఆర్ వద్ద, కేసుల నుంచి బయటపడేందుకు మోదీ వద్ద ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడితే ఏపీ ప్రజలు చూస్తూ ఊరుకోరని అన్నారు. జగన్ ఆస్తులు జప్తు చేస్తే, ఆ ఆస్తులు ఎవరివన్న విషయమై ఆయన నోరుమెదపలేదని విమర్శించారు.

More Telugu News