Posani Krishna Murali: తెలంగాణలో దెబ్బలు తిని పారిపోయిన ఆంధ్రా వాళ్లను పవన్ చూపిస్తే.. నేను కూడా ఆంధ్రాకు పారిపోతా: పోసాని

  • నేనూ హైదరాబాద్‌లోనే జీవిస్తున్నా
  • కేసీఆర్‌ను విమర్శిస్తూ వ్యాసాలు రాశా
  • ఎవరూ నన్ను కొట్టలేదు
  • ఓట్ల కోసం మాట మారుస్తున్నారు

తెలంగాణలో దెబ్బలు తిని పారిపోయిన ఆంధ్రా వాళ్లను జనసేన అధినేత పవన్ కల్యాణ్ చూపించాలని సినీ నటుడు పోసాని కృష్ణమురళి డిమాండ్ చేశారు. నేడు ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై పోసాని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓట్లు రాబట్టుకోవడం కోసం పవన్ హైదరాబాద్‌లో ఆంధ్రా వాళ్లను కొడుతున్నారనడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఆంధ్రావాళ్లను ఎవరు కొట్టారు? ఎవరు ఆంధ్రాకు పారిపోయారో రుజువులు చూపించాలని డిమాండ్ చేశారు. పవన్ వ్యాఖ్యలు సరికావన్నారు.

తాను కూడా హైదరాబాద్‌లోనే జీవిస్తున్నానని, తెలంగాణ వాళ్లు కొడుతున్నట్టు రుజువులు చూపిస్తే తాను కూడా ఆంధ్రాకు పారిపోతానని పోసాని ఎద్దేవా చేశారు. తాను తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ను విమర్శిస్తూ వ్యాసాలు రాశానని, కానీ ఏ ఒక్క తెలంగాణ బిడ్డ కూడా తనను కొట్టలేదన్నారు. తెలుగు వాళ్ల మధ్య పవన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పోసాని మండిపడ్డారు. గతంలో ఆంధ్రా నాయకులు కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలన్న పవన్.. ఇప్పుడు ఓట్ల కోసం మాట మారుస్తున్నారన్నారు. కేసీఆర్ ఎవరి భూములు లాక్కుంటున్నారో పవన్ చెప్పాలని పోసాని డిమాండ్ చేశారు.   

More Telugu News