Jagan: ఆ ఏడు జిల్లాల్లో ఒక్క ఓటు కూడా అడిగే హక్కు జగన్ కు లేదు: టీడీపీ నేత యామిని ఫైర్

  • జగన్ కు అభివృద్ధి కనిపించడం లేదా?
  • కడప స్టీల్ ప్లాంట్ విషయంలో నోరు కూడా విప్పలేదు
  • కేంద్రాన్ని ఒక్కసారి కూడా ఎందుకు నిలదీయరు?

టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని శనివారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి విపక్ష నేత జగన్ పై నిప్పులు చెరిగారు. జగన్ కు ఎన్నికల ముందే ప్రజాసమస్యలు గుర్తొస్తాయని విమర్శించారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నా ఏనాడూ కేంద్రాన్ని నిలదీయని వ్యక్తి జగన్ అని, టీడీపీ సర్కారు ఎంతో కష్టపడి అభివృద్ధి చేస్తున్నా చూడలేని వ్యక్తి జగన్ అని మండిపడ్డారు.

జగన్ తన ఆత్మను లోటస్ పాండ్ లోనే వదిలి వచ్చారని ఎద్దేవా చేశారు. ఉద్దానంలో కిడ్నీ బాధితుల కోసం టీడీపీ సర్కారు భారీగా ఖర్చు పెట్టి డయాలసిస్ కేంద్రాలు, ప్రత్యేక మినరల్ వాటర్ ప్లాంట్లు, నిపుణులతో వైద్య సేవలు అందిస్తుంటే జగన్ కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. మీ తండ్రి, మీ అమ్మ, మీరు అందరూ పులివెందుల నుంచి విజయం సాధించారు కానీ, ఒక్కసారి కూడా కడప స్టీల్ ప్లాంట్ గురించి కేంద్రాన్ని ప్రశ్నించిన పాపానపోలేదని విమర్శించారు.

పాదయాత్రలో ఒక్కసారి కూడా రాష్ట్ర సమస్యల గురించి కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేదని యామిని ప్రశ్నించారు. రూ.350 కోట్లు ఇచ్చినట్టే ఇచ్చి కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే రాష్ట్రంలోని 7 వెనుకబడిన జిల్లాలకు తీరని అన్యాయం జరిగిందని, ఆ జిల్లాల్లో ఒక్క ఓటు కూడా అడిగే హక్కు జగన్ కు లేదని మండిపడ్డారు.

More Telugu News