yeddyurappa: యడ్యూరప్పతో నాకు సంబంధం అంటగట్టడం దారుణం: ఎంపీ శోభ

  • యడ్యూరప్ప నన్ను పెళ్లి చేసుకున్నారనడం అవాస్తవం
  • కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పాల్పడుతోంది
  • కాంగ్రెస్ విడుదల చేసిన 'యడ్డీ డైరీ' బూటకం

కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పతో తనకు సంబంధాన్ని అంటగడుతూ కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ ఎంపీ శోభ కరంద్లాజే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు విడుదల చేసిన 'యడ్డీ డైరీ'లో ఓ దేవస్థానంలో తనను యడ్యూరప్ప వివాహం చేసుకున్నట్టు పేర్కొనడాన్ని ఆమె తప్పుబట్టారు. తన ఇమేజ్ ను దెబ్బతీసేందుకే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఉడిపిలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ విడుదల చేసిన డైరీ పచ్చి బూటకమని... సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూస్తాయని శోభ తెలిపారు. నీచ రాజకీయాలకు దిగిన కాంగ్రెస్ కు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. బీజేపీ అగ్రనేతలకు యడ్యూరప్ప నుంచి ముడుపులు అందాయనే ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. కాంగ్రెస్ తీరు ఇలానే ఉంటే లోక్ సభలో ఆ పార్టీ బలం 44 నుంచి 4కు పడిపోతుందని అన్నారు.

More Telugu News