Andhra Pradesh: జన్మజన్మలకు నీకు రుణపడి ఉంటానన్నా... అంటూ జగన్ ముందు కన్నీరు పెట్టుకున్న శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీను!

  • నేను 18 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా
  • అచ్చెన్నాయుడు నా వ్యాపారాలను అష్టదిగ్బంధం చేశారు
  • ఆర్థికంగా చితికిపోయినా జగన్ టికెట్ ఇచ్చారు

వైసీపీ అధినేత జగన్ పలాస బహిరంగ సభలో ఆ పార్టీ శ్రీకాకుళం లోక్ సభ అభ్యర్థి దువ్వాడ శ్రీను కన్నీరు పెట్టుకున్నారు. తాను గత 18 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాననీ, ఆర్థికంగా చితికిపోయానని శ్రీను తెలిపారు. తన వ్యాపారాలను ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అష్టదిగ్బంధనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబం రోడ్డుపైకి వచ్చిందనీ, తీవ్ర ఇబ్బందులలో ఉన్నామని చెప్పారు. అయినా జగన్ తమకు టికెట్ ఇచ్చారని భావోద్వేగం చెందుతూ కన్నీటిపర్యంతమయ్యారు.

ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుపై దువ్వాడ శ్రీను విమర్శలు గుప్పించారు. ‘డబ్బులుంటేనే టికెట్ ఇస్తామన్న చంద్రబాబు ఎక్కడ? శ్రీను ప్రజలతోనే ఉన్నాడు. నష్టపోయినాడు. ఏమైనా ఫరవాలేదు. శ్రీనుకే టికెట్ ఇస్తా అని చెప్పిన జగన్ అన్న ఎక్కడ? మాలాంటి సామాన్యులు, మాలాంటి అవకాశం లేనంటివాళ్లకు అవకాశం ఇచ్చావన్నా. మేం రుణపడి ఉన్నామన్నా’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు.

జన్మజన్మలకు తాను జగన్ కు రుణపడి ఉంటానని వ్యాఖ్యానించారు. జగన్ ఏ బాధ్యత ఇచ్చినా నెరవేరుస్తాననీ, నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు.

More Telugu News