Chandrababu: జగన్‌కు నేరాల అనుభవమే తప్ప పాలనానుభవం లేదు: సీఎం చంద్రబాబు ఎద్దేవా

  • ఈ ఐదేళ్లలో మనం చేసింది ప్రజల్లోకి వెళ్లి చెప్పండి
  • వైసీపీ, బీజేపీ, టీఆర్‌ఎస్‌ కుట్రలు తిప్పికొట్టండి
  • రానున్న 17 రోజులు చాలా కీలకమని మర్చిపోకండి

విపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి నేరాల్లో అనుభవమే తప్ప పాలనానుభవం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎద్దేవా చేశారు. నేరాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ జగన్‌ అయితే, అభివృద్ధి, సంక్షేమానికి టీడీపీ బ్రాండ్‌ అన్నారు. ఈ ఐదేళ్లలో ప్రజలకు చేయాల్సిందంతా చేశామని, ఇదే విషయాన్ని నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.  శుక్రవారం పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రానున్న 17 రోజులు అత్యంత కీలకమని, ప్రతి గంటనూ సద్వినియోగం చేసుకోవాలని  పార్టీశ్రేణులను కోరారు.

ఎన్నికలను ఎవరూ తేలిగ్గా తీసుకోరాదని, రాజకీయ వైరాలు పక్కనపెట్టి నాయకులంతా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ నేతల ప్రలోభాలను అధిగమించాలని కోరారు. బీజేపీ, టీఆర్ఎస్ లతో కలిసి ఆ పార్టీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలన్నారు. ఫ్రస్ట్రేషన్‌తో బీజేపీ, ఫ్యాక్షన్‌ ధోరణితో వైసీపీ తప్పు మీద తప్పులు చేస్తున్నాయని ఆరోపించారు. కుట్రలు చేసి మన కార్యకర్తల సమాచారం, డేటా చోరీ చేశారని, మన వాళ్లనే బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు.

More Telugu News