YSRCP: నేను మాట్లాడిన స్పీచ్ మొత్తం వినండి... మీకే తెలుస్తుంది: పీవీపీ వివరణ

  • నష్టనివారణ చర్యలకు దిగిన వైసీపీ నేత
  • నా వ్యాఖ్యలను వక్రీకరించారు
  • మీడియాకు వివరణ

వైసీపీలో కొత్తగా చేరిన ప్రముఖ వ్యాపారవేత్త 'పీవీపీ' (పొట్లూరి వరప్రసాద్) అనుకోని వివాదంలో చిక్కుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్ట్ అంటూ ఆయన వ్యాఖ్యానించినట్టు మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. పీవీపీ వ్యాఖ్యలకు ప్రముఖుల ఖండన కూడా తోడవడంతో ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో ఈ చివరి నుంచి ఆ చివరికి పాకిపోయింది.

 అయితే, తాను అన్నది ఏంటో సరిగా గమనించకుండా వక్రీకరించారంటూ పీవీపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయవాడలో ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టారు. సభలో తనకంటే ముందు ఏడుగురు వ్యక్తులు మాట్లాడిన తరుణంలో మరోసారి తాను కూడా అదే సబ్జెక్ మాట్లాడి బోర్ కొట్టించనని చెప్పానే తప్ప, ప్రత్యేక హోదా ఓ బోరింగ్ సబ్జెక్ట్ అనలేదని స్ఫష్టం చేశారు. కావాలంటే తాను మాట్లాడిన స్పీచ్ మొత్తం వింటే మీకే తెలుస్తుందని మీడియా ముఖంగా వివరణ ఇచ్చారు.

తాను అనని మాటలను తనకు ఆపాదించి, చివరికి ఈ విషయంలో పార్టీ అధినేతను కూడా లాగడం దారుణమని అసహనం వ్యక్తం చేశారు. తాను ఎవరి ఉచ్చులో పడదలుచుకోలేదని, ప్రత్యర్థుల మైండ్ గేమ్ లను అసలు పట్టించుకోనని స్పష్టం చేశారు.

More Telugu News