KCR: ముగ్గురు సిట్టింగ్ లకు టికెట్ లేదని చెప్పేసిన కేసీఆర్!

  • ఖరారైన టీఆర్ఎస్ జాబితా
  • పొంగులేటి, జితేందర్, సీతారాం నాయక్ లకు నో చాన్స్
  • సగం మంది కొత్తవారికి ఛాన్సిచ్చిన కేసీఆర్

తెలంగాణ లోక్ సభ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ పడే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. ఈ జాబితాలో ముగ్గురు సిట్టింగ్ లకు టికెట్ ఇవ్వలేమని ఆయన స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. పొంగులేటి సుధాకర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, సీతారాం నాయక్ లకు ఈ దఫా టికెట్ లభించబోదని, ఈ విషయాన్ని వారికి స్వయంగా కేసీఆరే చెప్పేశారని తెలుస్తోంది.

ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన పొంగులేటి, విజయం సాధించిన తరువాత టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి ఫిరాయించిన నామా నాగేశ్వరరావుకు ఇవ్వనున్నారని సమాచారం. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో అక్కడి నుంచి పోటీకి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. మొత్తం మీద టీఆర్ఎస్ ఎంపీల అభ్యర్థుల జాబితాలో సగం మంది కొత్తవారే ఉంటారని సమాచారం.

More Telugu News