Chandrababu: మోదీకి నాయకత్వ లక్షణాలు లేవనడానికి ఇంతకుమించిన ఉదాహరణ అవసరం లేదు: జాతీయ మీడియాతో చంద్రబాబు
![](https://img.ap7am.com/bimg/tnews-bb44cc39f132cd6569a4f2ccd845e4e8af1f8ba6.jpg)
- గుజరాత్ నమూనా కానే కాదు
- ప్రతిభావంతులు తారసపడితే వారిని తొక్కేస్తారు
- మోదీ ఎవరినీ అంత తేలిగ్గా నమ్మరు
నరేంద్రమోదీ గొప్ప నేత కాదని, ఆయనకు నాయకత్వ లక్షణాలే లేవని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. జాతీయ పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలపై స్పందించిన చంద్రబాబు.. మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. గుజరాత్ నమూనాతో మోదీ ప్రచారం చేసుకున్నారని, నిజానికి గుజరాత్ గొప్ప మోడల్ కాదని పేర్కొన్నారు. గుజరాత్లో అసలు నాలెడ్జే లేదని, మోదీ అక్కడ వ్యాపారాన్ని మాత్రమే చూశారన్నారు. మోదీ నుంచి ప్రజలు ఎంతో ఆశించారని, కానీ వారి ఆశలను మోదీ వమ్ముచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
మోదీకి అసలు నాయకత్వ లక్షణాలే లేవని, ఆయన ఎవరినీ అంత తేలిగ్గా నమ్మరని పేర్కొన్నారు. ఒకవేళ ప్రతిభావంతమైన వ్యక్తులు తారసపడితే వారిని బయటకు రానివ్వరని, వారిలోని నాయకత్వ లక్షణాలను పూర్తిగా చంపేస్తారని ఆరోపించారు. మీడియా అయినా, రాజకీయాలైనా, కార్పొరేట్ వ్యవస్థలైనా.. ఏవైనా సరే మోదీ ఇలానే వ్యవహరిస్తారని, దేశానికి ఇది పెను ప్రమాదమని చంద్రబాబు అన్నారు. గుజరాత్ నుంచి ఐఐటీ, ఐఐఎంల నుంచి ఎప్పుడూ టాపర్స్ రాలేదని, మోదీకి నాయకత్వ లక్షణాలు లేవని చెప్పడానికి ఇంతకుమించిన ఉదాహరణ అవసరం లేదన్నారు.