Chandrababu: టీడీపీకి నామా రాజీనామా.. చంద్రబాబుకు లేఖ రాసిన ఖమ్మం జిల్లా నేత

  • టీడీపీ బలోపేతానికి చేసిన కృషి ఫలించలేదు
  • తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పార్టీని వీడుతున్నా
  • చంద్రబాబుకు రాసిన లేఖలో నామా

తెలంగాణలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న ఖమ్మం జిల్లా నేత నామా నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీని తాను ఎందుకు వీడుతున్నదీ వివరిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. తెలంగాణలో టీడీపీకి పునర్వైభవం కోసం రాత్రీ పగలు కష్టపడినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, తెలంగాణ గడ్డపై టీడీపీ మనుగడ ప్రశ్నార్థకమైందని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీడీపీ జాతీయ పొలిట్ బ్యూరో పదవితోపాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

2009 ఎన్నికల్లో ఖమ్మం నుంచి లోక్‌సభ అభ్యర్థిగా గెలిచిన  నామా టీడీపీ పొలిట్ బ్యూరోలో ఉన్న సీనియర్ నేత. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. గత రెండు మూడు రోజులుగా నామా టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్టు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వార్తలను నిజం చేస్తూ ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరి లోక్‌సభకు పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News