Mumbai: లైంగికంగా వేధిస్తున్నాడని మ్యాగజైన్ ఎడిటర్ ను హత్య చేసిన లేడీ రిపోర్టర్!

  • ముంబైలో హత్యకు గురైన నిత్యానంద్ పాండే
  • కేసు విచారణను సీరియస్ గా తీసుకున్న పోలీసులు
  • ఆఫీసులోని ఇద్దరు ఉద్యోగుల అరెస్ట్

ఇటీవల ముంబైలో కలకలం రేపిన 'న్యూస్ పోర్టల్' మ్యాగజైన్ ఎడిటర్ నిత్యానంద్ పాండే (44) హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆఫీసులో రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్ గా ఇంటర్న్ షిప్ చేస్తున్న యువతి, ప్రింటింగ్ సెక్షన్ లో పనిచేసే ఉద్యోగి సతీశ్ మిశ్రాతో కలిసి పాండేను హత్య చేసినట్టు తేల్చారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు, అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేసి, వీరిద్దరి ఫోన్ కాల్స్ ఆధారంగా అనుమానంతో ప్రశ్నించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

సదరు యువతి గత రెండేళ్లుగా న్యూస్ పోర్టల్ లో పని చేస్తుండగా, నిత్యానంద పాండే ఎన్నో మార్లు లైంగిక వేధింపులకు గురిచేశాడు. తనను ఇక వదిలేయాలని ఆమె ఎదురు తిరగగా, ప్రమోషన్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టాడు. దీంతో ఆమె ముద్రణా విభాగంలో పనిచేసే సతీశ్ మిశ్రా సాయం కోరింది. అప్పటికే పాండే తనకు వేతనాలు ఆలస్యంగా ఇస్తున్నాడన్న ఆగ్రహంతో ఉన్న సతీశ్ ఆమెకు సహకరించేందుకు అంగీకరించాడు.

ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి ప్లాన్ చేసి, పాండేను ముంబై శివారులోని ఉత్తర భయందర్ ప్రాంతానికి తీసుకెళ్లారు. వెళ్తున్న సమయంలో వాహనంలోనే మత్తుమందు కలిపిన మద్యం తాగించారు. స్పృహలో లేని పాండేను తాడు సాయంతో గొంతు బిగించి చంపి, భివండీ ప్రాంతంలో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించామని పోలీసులు తెలిపారు.

More Telugu News