Andhra Pradesh: విశాఖ వైసీపీలో అసంతృప్తి జ్వాలలు.. బీభత్సం సృష్టించిన వంశీకృష్ణ అనుచరులు!

  • విజయనిర్మలకు టికెట్ ఇచ్చిన జగన్
  • ఆగ్రహంతో ఊగిపోయిన వంశీ అనుచరులు
  • ఎంపీ అభ్యర్థి సత్యనారాయణ ఆఫీసుపై దాడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే 175 మంది అభ్యర్థుల పేర్లను వైసీపీ అధినేత జగన్ ఈరోజు ప్రకటించిన సంగతి తెలిసిందే. జగన్ ప్రకటన వెలువడి గంట కూడా కాకముందే ఆ పార్టీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. విశాఖపట్నం తూర్పు టికెట్ ను విజయనిర్మలకు కేటాయించడంపై విశాఖ తూర్పు వైసీపీ సమన్వయకర్త వంశీకృష్ణ అనుచరులు ఈరోజు భగ్గుమన్నారు.

విశాఖ వైసీపీ లోక్ సభ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఆఫీసుకు భారీ సంఖ్యలో చేరుకున్న వంశీ అనుచరులు అక్కడి ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ‘రావాలి వంశీ-కావాలి వంశీ’ అని నినాదాలు చేశారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో ఇక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

మరోవైపు వంశీకృష్ణతో మాట్లాడేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. కాగా, సర్వేలు అనుకూలంగా లేకపోవడంతోనే వంశీకృష్ణకు టికెట్ నిరాకరించినట్లు సమాచారం.

More Telugu News