Andhra Pradesh: 24 రోజుల సమయం మాత్రమే ఉంది.. కంటిమీద కునుకులేకుండా పనిచేయాలి!: సీఎం చంద్రబాబు

  • టీడీపీ శ్రేణులతో సీఎం టెలీకాన్ఫరెన్స్
  • ఏపీలో జరుగుతున్న ధర్మయుద్ధంలో విజయంపై ధీమా
  • త్వరలోనే మిగతా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ప్రకటన

ఏపీలో టీడీపీ ధర్మయుద్ధం చేస్తోందనీ, ఈసారి విజయం తమదేనని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ రెండు విడతల్లో 141 మంది అభ్యర్థులను ప్రకటించామని సీఎం గుర్తుచేశారు. అన్ని పార్టీల కంటే టీడీపీనే ముందు ఉందనీ, త్వరలోనే మిగతా ఎమ్మెల్యే, లోక్ సభ అభ్యర్థులను ప్రకటిస్తామని పేర్కొన్నారు. అమరావతిలో ఈరోజు టీడీపీ బూత్ స్థాయి కన్వీనర్లు, సేవామిత్రలు, ప్రజాప్రతినిధులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

నిన్న చేపట్టిన చిత్తూరు, శ్రీకాకుళం పర్యటనలు విజయవంతం అయ్యాయని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రమంతా టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహం కనిపిస్తోందనీ, ఇది పార్టీకి శుభసూచకమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ‘ఉత్సాహంగా కదం తొక్కండి-ఉద్ధృతంగా ప్రచారం చేయండి’ అని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

మనకు ఇంకా 24 రోజుల సమయం మాత్రమే ఉందనీ, కంటిపై కునుకు లేకుండా పనిచేయాలని కార్యకర్తలు, నేతలకు దిశానిర్దేశం చేశారు. లబ్ధిదారులే టీడీపీ తరఫున ప్రచార సారథులని ఆయన వ్యాఖ్యానించారు. ఓ పెద్దకుమారుడిగా తన తరఫున 70 లక్షల మంది రైతన్నలు ప్రచారం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే కోటి మంది చెల్లెమ్మలు తనకు అండగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News