Sagineni Yamini: తనకు టికెట్ కోసం బ్రాహ్మణులు రావాలంటున్న... సాధినేని యామిని ఆడియో లీక్!

  • సీఎం ఇంటి దగ్గర నినాదాలు చేస్తున్నారు
  • 30 మంది బ్రాహ్మణులను తెచ్చి నినాదాలు చేయించండి
  • అనఫిషియల్ గా మీడియాతో కవర్ చేయిస్తానంటున్న యామిని

రానున్న ఎన్నికల్లో టీడీపీ టికెట్ ను ఆశిస్తున్న సాధినేని యామిని మాట్లాడినట్టుగా చెబుతున్న ఓ ఆడియో క్లిప్ లీకైంది. తన తరఫున 30 మంది బ్రాహ్మణులు వచ్చి, ప్లకార్డులు పట్టుకుని ప్రజావేదిక వద్ద నినాదాలు చేయాలని ఈ ఫోన్ కాల్ లో ఆమె కోరుతున్నారు. దగ్గర్లోని వాళ్లంతా రావాలని ఓ వ్యక్తికి ఆమె ఫోన్ చేసి చెబుతున్నారు.

ఈ ఆడియోలో... "సీఎం గారి ఇంటిదగ్గర, ప్రజా వేదిక దగ్గర... వివిధ కులాల వాళ్లు, మా కులాల వాళ్లకు ఎక్కువ సీట్లు ఇవ్వండి, లేదంటే మా నియోజకవర్గంలో పలానా వాళ్లకు సీటివ్వండి. పలానా వాళ్లకు సీటివ్వకండి అని చెబుతున్నారు. ఇక్కడ మీడియా మొత్తం కూడా బాగా హైలైట్ చేస్తున్నారు.

నాకేం అనిపిస్తోందంటే... మనవాళ్లు కూడా... కొంతమంది బ్రాహ్మణులు కూడా కొన్ని ప్లకార్డులు పట్టుకుని... బ్రాహ్మణులకు సీటివ్వాలి... బ్రాహ్మణులకు సీటివ్వాలి... అని చెప్పి కనీసం 20, 30 మంది ఇక్కడికి వస్తే, నేను మెల్లిగా, అనఫిషియల్ గా మీడియా వాళ్లకు చెప్పి, మిమ్మల్ని కూడా కవర్ చేయమని చెబుతాను. అంటే... దీన్ని మొత్తం రాష్ట్రమంతా చూస్తుంటారు కాబట్టి, కనీసం మన సామాజిక వర్గం వారు కూడా సీటు కోసం పోరాడుతున్నారు అని తెలుస్తుంది. దీని గురించి ఒక్కసారి ఆలోచించి, వీలైతే దగ్గర్లో ఉన్నవాళ్లంతా తొందరగా రావడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది" అని యామిని చెబుతున్నట్టు వినిపిస్తోంది.

More Telugu News