Pollachi: తమిళనాడు డిప్యూటీ స్పీకర్ తనయుడిపై ఆరోపణలు చేస్తున్నారంటూ.. డీఎంకే చీఫ్ స్టాలిన్ అల్లుడిపై కేసు!

  • ఫేస్‌బుక్ స్నేహం పేరుతో అమ్మాయిలకు వల
  • యువతి ఇచ్చిన ఫిర్యాదుతో గుట్టు రట్టు
  • ముఠా చేతిలో 200 మంది యువతులు 

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పొల్లాచ్చి సెక్స్ రాకెట్ కేసు విషయంలో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ డీఎంకే చీఫ్ స్టాలిన్ అల్లుడిపై కేసు నమోదైంది. పాఠశాలలు, కళాశాలల అమ్మాయిలే లక్ష్యంగా ఈ సెక్స్ రాకెట్ ముఠా చెలరేగిపోయింది. ఫేస్‌బుక్ స్నేహం పేరుతో అమ్మాయిలతో కొంతకాలం సఖ్యంగా ఉండి ఆపై శారీరకంగా దగ్గరయ్యేవారు. దీన్నంతా వీడియో తీసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డారు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరపడంతో ఈ వ్యవహారమంతా వెలుగులోకి వచ్చింది. ఈ ముఠా ఉచ్చులో దాదాపు 200 మందికి పైగా యువతులు చిక్కినట్టు విచారణలో తేలింది.

ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ కేసులో అన్నాడీఎంకే పొల్లాచ్చి శాఖ యువ నాయకుడు నాగరాజన్ ప్రధాన నిందితుడిగా తేలడంతో పార్టీ అతడిని వెంటనే సస్పెండ్ చేసింది. కాగా ఈ కేసు విషయంలో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ అల్లుడు శబరీశన్.. తన కుమారుడి పేరును ప్రస్తావిస్తూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు తమిళనాడు డిప్యూటీ స్పీకర్ వి.విజయరామన్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు శబరీశన్‌పై కేసు నమోదు చేశారు.

More Telugu News