Andhra Pradesh: సత్తెనపల్లిని ప్రపంచ పటంలో నేనే పెట్టా.. ఆందోళనకారులంతా నావల్ల లబ్ధిపొందినవారే!: కోడెల శివప్రసాద్

  • నాకు వ్యతిరేకంగా ఆందోళన చేయడం బాధ కలిగించింది
  • దీనివల్ల పార్టీకి అంతిమంగా నష్టం జరుగుతుంది
  • మీడియాతో మాట్లాడిన ఏపీ స్పీకర్,టీడీపీ నేత

సత్తెనపల్లిలో తనకు వ్యతిరేకంగా సొంత టీడీపీ నేతలు ఆందోళన చేయడం బాధ కలిగించిందని ఏపీ స్పీకర్, సత్తెనపల్లి ఎమ్మెల్యే కోడెల శివప్రసాద్ తెలిపారు. కొందరు వ్యక్తులు కుట్రపూరితంగా టీడీపీ నేతలతో ఈ ఆందోళనలు చేయించారని ఆరోపించారు. దీనివల్ల అంతిమంగా పార్టీకి నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఈ ఆందోళనలో పాల్గొన్నవారంతా తనవల్ల లబ్ధిపొందినవారేనని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో ఈరోజు కోడెల మీడియాతో మాట్లాడారు.

సత్తెనపల్లిని ప్రపంచపటంలో పెట్టిన ఘనత తనదేనని కోడెల శివప్రసాద్ తెలిపారు. తనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయడానిక సరైన కారణం ఏదైనా చెప్పగలరా? అని ప్రశ్నించారు. నరసరావుపేట నుంచి పోటీ చేయమని తనను ఎవరూ అడగలేదని కోడెల స్పష్టం చేశారు. అదంతా ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు.

సత్తెనపల్లికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ టికెట్ ను టీడీపీ నేత రాయపాటి ఎలా అడుగుతారని ప్రశ్నించారు. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనను వివాదాస్పదం చేయననీ, ఆందోళనకారులతో కూడా మాట్లాడుతానని తేల్చిచెప్పారు. రాబోయే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి 15,000 మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News