Andhra Pradesh: ఏపీలో వైసీపీతో కలవాల్సిన ఖర్మ మాకు పట్టలేదు!: బీజేపీ నేత కిషన్ రెడ్డి

  • సీఎం కుర్చీ కోసం బాబు ఎవరినైనా మోసం చేస్తారు
  • మతోన్మాద మజ్లిస్ తో టీఆర్ఎస్ దోస్తీ చేస్తోంది
  • రాహుల్ వచ్చిన ప్రతీసారి ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే జంప్ అవుతున్నారు

ముఖ్యమంత్రి కుర్చీ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఎవరినైనా మోసం చేస్తారని బీజేపీ నేత కిషన్ రెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీతో కలవాల్సిన ఖర్మ తమకు పట్టలేదని వ్యాఖ్యానించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు.

మతోన్మాద పార్టీ అయిన మజ్లిస్ తో టీఆర్ఎస్ దోస్తీ చేస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డాడు. కేసీఆర్ ను ఢిల్లీకి పంపి ఇక్కడ సీఎం కావాలని కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఓటర్ల చేతికి వేసిన సిరా గుర్తు ఆరకముందే నేతలు పార్టీలు ఫిరాయించడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ హైదరాబాద్ కు వచ్చిన ప్రతీసారి ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీచేయాలో బీజేపీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.

More Telugu News