Andhra Pradesh: సత్తెనపల్లి నుంచి 15,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తా.. వైసీపీ వాళ్లు ముక్కున వేలేసుకోవాల్సిందే!: కోడెల శివప్రసాద్

  • టీడీపీ అన్నది పెద్ద కుటుంబం లాంటిది
  • మరోసారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు
  • గుంటూరులో మీడియాతో ఏపీ స్పీకర్

తెలుగుదేశం పార్టీ అనేది పెద్ద కుటుంబం లాంటిదని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిపారు. కుటుంబంలో చిన్నచిన్న మనస్పర్థలు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఇలాంటి వాటి గురించి చర్చించడం అనవసరమని పేర్కొన్నారు. టీడీపీ అధిష్ఠానం తనకు మరోసారి సత్తెనపల్లి నుంచి పోటీచేసేందుకు అవకాశం కల్పించిందని కోడెల అన్నారు. గుంటూరులో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

తనకు రెండోసారి అవకాశం కల్పించిన టీడీపీ హైకమాండ్ కు కోడెల ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 22న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో అందరూ కలిసి తనను గెలిపించారనీ, ఈ ఎన్నికల్లోనూ అలాగే కలసికట్టుగా పనిచేయాలని టీడీపీ శ్రేణులను కోరారు. ఈ ఎన్నికల్లో 15,000 మెజారిటీతో ఘనవిజయం సాధిస్తాననీ, తన గెలుపును చూసి వైసీపీ నేతలు ముక్కున వేలేసుకోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.

More Telugu News