Vijayawada: కాపు ఓట్లపై గురి.. మచిలీపట్నం నుంచి వంగవీటి రాధాను పోటీ చేయించే యోచన!

  • సామాజిక వర్గం పరంగా అదే మంచిదనుకుంటున్న చంద్రబాబు
  • మచిలీపట్నంలో రెండున్నర లక్షల కాపు ఓటర్లు
  • అసెంబ్లీ సీట్లపైనా దీని ప్రభావం ఉంటుందని అంచనా

టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న కాపు సామాజిక వర్గం నేత, వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధా ఎట్టకేలకు సైకిలెక్కడంతో రానున్న ఎన్నికల్లో ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న చర్చ సాగుతోంది. ఆయనను మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఎందుకంటే, ఈ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో దాదాపు రెండున్నర లక్షల కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయని అంచనా. అందువల్ల రాధాను ఇక్కడి నుంచి పోటీ చేయిస్తే పార్లమెంటరీ నియోజకవర్గంతోపాటు దాని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల పైనా సానుకూల ప్రభావం ఉంటుందని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఒకవేళ రాధాను మచిలీపట్నం నుంచి బరిలోకి దించితే సిట్టింగ్‌ ఎంపీ కొనకళ్ల నారాయణను పెడన అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు నిర్ణయం ఏదైనా రాధాకు తనకు పట్టున్న విజయవాడలోని ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం మాత్రం లేదని పార్టీ వర్గాల అంచనాలను బట్టి తేలిపోయింది.

More Telugu News