yarapatinene: నన్ను ఎదుర్కోలేకే.. మావోయిస్టుల పేరుతో లేఖలు సృష్టిస్తున్నారు: యరపతినేని

  • మావోల లేఖల పేరుతో వైసీపీ నాటకాలాడుతోంది
  • నకిలీ లేఖలు తయారు చేసిన వారిని బయటకు లాగుతాం
  • 25వేల ఓట్ల మెజార్టీతో నేను గెలవడం ఖాయం

పద్ధతి మార్చుకోవాలంటూ టీడీపీ గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతో పాటు పలువురు నేతలకు వార్నింగ్ ఇస్తున్నట్టు మావోయిస్టుల పేరుతో లేఖలు దర్శనమివ్వడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ లేఖలపై యరపతినేని స్పందించారు. ఎన్నికల్లో తనను ఎదుర్కోలేకే... మావోయిస్టుల పేరుతో వైసీపీ నేతలు లేఖల నాటకం ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. తనను ఓడించేందుకు ఇప్పటికే ఎన్నో కుట్రలకు వైసీపీ నేతలు పాల్పడ్డారని... ఆ కుట్రల్లో నకిలీ మావోయిస్టు లేఖలు కూడా ఒకటని చెప్పారు. మావోల లేఖ పేరుతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గురజాల నియోజవర్గంలో రూ. 1600 కోట్ల నిధులతో అభివృద్ధి జరిగిందని... టీడీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని... తనను ఎదుర్కోలేకే వైసీపీ నేతలు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని యరపతినేని చెప్పారు. వైసీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. మావోయిస్టుల పేరుతో నకిలీ లేఖను తయారుచేసిన వారిని బయటకు లాగుతామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో తాను 25వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News