Vangaveeti Radha: లగడపాటితో కలిసి అర్ధరాత్రి చంద్రబాబు ఇంటికి వెళ్లిన వంగవీటి రాధా!

  • గత నెలలో వైసీపీకి రాధా రాజీనామా
  • ఇంకా టీడీపీలో చేరని వంగవీటి
  • రాజకీయ భవిష్యత్ పై బాబుతో చర్చలు
  • రెండు గంటలకు పైగా సమావేశం

గత నెలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన వంగవీటి రాధాకృష్ణ, ఇప్పటివరకూ ఏ పార్టీలోనూ చేరలేదన్న సంగతి తెలిసిందే. రాజీనామా చేసిన ఒకటి, రెండు రోజుల్లోనే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతారని వార్తలు రాగా, అది జరగలేదు. రాధా మన పార్టీలోకి వస్తున్నారని, అందరూ కలిసి పనిచేయాలని అప్పట్లో చంద్రబాబు కూడా వ్యాఖ్యానించారు. రాధా ఏ పార్టీలో చేరకపోవడంతో, తిరిగి వైసీపీలోకి రావాలని ఆ పార్టీ సీనియర్ నేతలు చర్చలు సాగించినట్టు కూడా వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తో కలిసి వంగవీటి రాధా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లి రహస్య మంతనాలు జరిపారు. దాదాపు రెండు గంటల పాటు వీరి మధ్య భేటీ జరిగినట్టు సమాచారం. తన రాజకీయ భవిష్యత్తుపై చంద్రబాబుతో మాట్లాడేందుకు రాధా వచ్చినట్టు తెలుస్తోంది. కాగా, ఆయన తెలుగుదేశం పార్టీలో చేరితే, ఎక్కడి నుంచి పోటీకి దింపాలన్న విషయంలోనూ సందిగ్ధత ఇంకా వీడలేదు. రాధా అభిమానులు మాత్రం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గమైతే బాగుంటుందని అంటున్నారు.

More Telugu News