Vijayawada: విజయవాడ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తానంటున్న కేసీఆర్ అభిమాని!

  • విజయవాడ సెంట్రల్ నుంచి బరిలోకి దిగుతానన్న కొణిజేటి ఆదినారాయణ
  • కేసీఆర్‌కు వీరాభిమాని
  • టికెట్ ఇవ్వాలంటూ కేసీఆర్‌కు మొర

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన వేళ.. విజయవాడ నుంచి ఆ పార్టీ టికెట్‌పై బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేసీఆర్ వీరాభిమాని కొణిజేటి ఆదినారాయణ తెలిపారు. విజయవాడ సెంట్రల్ నుంచి టీఆర్ఎస్ టికెట్‌పై పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని అధిష్ఠానానికి కూడా చెప్పానన్నారు. తెలంగాణ ఎంపీ అభ్యర్థులతోపాటే తాను కూడా బీఫారం తీసుకుంటానని ధీమా వ్యక్తం చేసిన ఆదినారాయణ.. ప్రచారానికి కేసీఆర్‌ను తీసుకొస్తానన్నారు.

విజయవాడ అజిత్‌సింగ్ నగర్‌కు చెందిన ఆదినారాయణకు కేసీఆర్ అంటే వల్లమాలిన అభిమానం. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవాలని కనకదుర్గమ్మను మొక్కుకున్నారు. గెలిచాక 101 కొబ్బరికాయలతో మొక్కు తీర్చుకున్నారు. అంతేకాదు, మోకాళ్లపై ఇంద్రకీలాద్రి ఎక్కి అమ్మవారిని దర్శించుకున్నారు.

More Telugu News