Telangana: అమ్మ తిట్టిందని.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు.. సజీవదహనం!

  • తెలంగాణలోని బోయిన్ పల్లిలో ఘటన
  • పెరుగు తీసుకురావాలని చెప్పిన తల్లి
  • స్నేహితుడితో వీడియోకాల్ మాట్లాడుతూ అఘాయిత్యం

తల్లి తిట్టిందన్న కారణంతో ఓ యువకుడు తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. స్నేహితుడితో వీడియో కాల్ లో మాట్లాడుతూనే ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకునేలోపే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన వివేక్ హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇక్కడే తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో షాపుకు వెళ్లి పెరుగు తీసుకురావాలని తల్లి చెప్పింది. అయితే ఈ విషయాన్ని వివేక్ పట్టించుకోకపోవడంతో ఆమె కుమారుడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తల్లి తిట్టడంతో తీవ్ర మనస్తాపానికి లోనైన వివేక్ బాటిల్ నిండా పెట్రోల్ తీసుకుని నగర శివార్లలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాడు.

సరిగ్గా అప్పుడే శివ అనే స్నేహితుడు వివేక్ కు వీడియో కాల్ చేశాడు. ఈ సందర్భంగా వీడియో కాల్ మాట్లాడుతూనే పెట్రోల్ పోసుకున్న వివేక్ నిప్పంటించుకున్నాడు. దీంతో భయపడిపోయిన శివ పోలీసులకు సమాచారం అందించాడు. అధికారులు ఘటనాస్థలికి చేరుకునేలోగానే అతను సజీవదహనమయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News