Telugudesam: రోజాపై పోటీకి దిగాల్సింది ఎవరో ఇంకా తేల్చని చంద్రబాబు!

  • తెలుగుదేశం పార్టీలో ప్రతిష్ఠంభన
  • గాలి కుటుంబంలో లోపించిన ఐక్యత
  • ముగ్గురు సభ్యులతో కమిటీ

నగరి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత ఆర్కే రోజాపై పోటీకి ఎవరిని దించాలన్న విషయంలో తెలుగుదేశం పార్టీలో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో అన్ని అసెంబ్లీ స్థానాలపైనా ఓ అంచనాకు వచ్చిన చంద్రబాబు, నగరి విషయంలో మాత్రం ఇంకా ఓ స్పష్టతకు రాలేదు. ఈ ప్రాంతంలో పట్టున్న నేత గాలి ముద్దుకృష్ణమనాయుడి కుటుంబంలో ఐక్యత కనిపించకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

గత ఎన్నికల్లో రోజాపై ఓటమిపాలైన గాలిని చంద్రబాబు ఎమ్మెల్సీని చేసిన సంగతి తెలిసిందే. ఆయన మరణం తరువాత నగరి సీటు కోసం ఆయన వారసులంతా తమవంతు ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. సిద్ధార్థ విద్యా సంస్థల అధినేత అశోక్ రాజు సైతం ఇదే నియోజకవర్గ సీటును ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని వేసిన చంద్రబాబు, క్షేత్రస్థాయిలో నగరిలో పర్యటించి, గెలుపోటములపై నివేదిక ఇవ్వాలని సూచించినట్టు తెలుస్తోంది. వారు చెప్పే విషయంపై ఆధారపడి నగరి సీటును ఎవరికి అప్పగించాలన్న విషయాన్ని చంద్రబాబు తేలుస్తారని తెలుగుదేశం పార్టీ వర్గాలు అంటున్నాయి.

More Telugu News