Andhra Pradesh: చంద్రబాబుకు 'సన్' స్ట్రోక్ తగిలిందా?: కన్నా లక్ష్మీనారాయణ

  • డేటా చోరీ వ్యవహారంపై కన్నా ఆరోపణలు
  •  సిట్ పేరుతో  రాజకీయం చేయొద్దని హితవు
  •  ‘డేటా దొంగ..’ అంటూ కన్నా ట్వీట్

డేటా చోరీ వ్యవహారం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం, టీడీపీ నేతలపై తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్, ఏపీ విపక్ష పార్టీలు వైసీపీ, బీజేపీలు విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి ఆరోపణలు చేశారు. చంద్రబాబును ‘డేటా దొంగ’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఓ ట్వీట్ చేశారు.

 ‘నీ 40 ఏళ్ల అనుభవం తగలెయ్య..’ అంటూ బాబుపై కన్నా రెచ్చిపోయారు. ఫారం-7 కింద వచ్చిన దరఖాస్తులను ఎన్నికల సంఘం అధికారులు లోతుగా పరిశీలించి, వాటిలో ఏవైనా తప్పు ఉంటేనే ఆ ఓట్లను తొలగిస్తుందన్న విషయం చంద్రబాబుకు తెలిసి కూడా ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. డేటా చోరీ వివాదంపై సిట్ పేరుతో ఎందుకు రాజకీయం చేస్తున్నారని చంద్రబాబును ప్రశ్నించిన కన్నా, బాబుకు ‘సన్ స్ట్రోక్’ తగిలిందా? అంటూ సెటైర్లు విసిరారు.  

కాగా, డేటా చోరీ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్స్ సంస్థ ఎండీ అశోక్, మంత్రి నారా లోకేశ్ కు మంచి ఫ్రెండ్ అనే వార్తలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘సన్ స్ట్రోక్’ తగిలిందా? అంటూ చంద్రబాబును కన్నా ఎద్దేవా చేశారు.

More Telugu News