తెలంగాణకు చెందినవారి పేర్లను ఏపీ ఓటర్ లిస్టులో చేర్చారంటూ టీడీపీ ఆందోళన

  • 70 మంది పేర్లను లిస్ట్‌లో చేర్చారు
  • తెలంగాణ ఆధార్ కార్డు ఉండగా ఎలా చేర్చారు?
  • ఎమ్మార్వోపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సరికొత్త వివాదాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా తెలంగాణకు చెందినవారి ఓట్లను చేర్చారంటూ కృష్ణా జిల్లాలో పెద్ద దుమారమే చెలరేగింది. తెలంగాణ జిల్లాలతో కృష్ణా జిల్లా లింక్ అయి ఉంటుంది. అయితే ఆ జిల్లాలోని వీరులపాడు మండలం, పెద్దాపురం గ్రామాల్లో తెలంగాణ సహా ఇతర ప్రాంతాలకు చెందిన వారి ఓట్లను చేర్చారంటూ స్థానిక టీడీపీ నేతలతో కలిసి కార్యకర్తలు వీరులపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నేడు ఆందోళనకు దిగారు.

పెద్దాపురం గ్రామంలో తెలంగాణకు సంబంధించిన 70 ఓట్లను చేర్చారని.. వారంతా టీఆర్ఎస్, వైసీపీ సానుభూతిపరులంటూ ఎమ్మార్వోకి ఫిర్యాదు చేశారు. ఈ విషయం తన దృష్టికి రాలేదంటూ ఎమ్మార్వో పేర్కొనడంతో టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆధార్ కార్డు ఉండగా.. ఏపీ ఓటర్ల జాబితాలో ఎలా పేర్లను నమోదు చేశారని నిలదీశారు. దీనిపై దర్యాప్తు చేసి చర్య తీసుకుంటామని ఎమ్మార్వో హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Telangana
Krishna District
Veerulapadu
Peddapuram
Telugudesam
TRS
YSRCP

More Telugu News