Andhra Pradesh: ఐటీ గ్రిడ్స్ కేసులో జోరు పెంచిన సిట్.. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసిన స్టీఫెన్ రవీంద్ర!

  • నేడు హైదరాబాద్ లో సమావేశమైన సిట్ అధికారులు
  • డేటాను సేకరించేందుకు ఓ టీమ్
  • అశోక్ ను పట్టుకునేందుకు మరో బృందం ఏర్పాటు
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కాకరేపుతున్న ఐటీ గ్రిడ్స్ కంపెనీ డేటా వ్యవహారంలో సిట్ అధికారులు విచారణను ముమ్మరం చేశారు. ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో ఈరోజు అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఐటీ గ్రిడ్స్ విచారణ కోసం మూడు బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు సిట్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. డేటాను విశ్లేషించడంతో పాటు డిలీట్ చేసిన డేటాను తిరిగి పొందేందుకు ఓ టీమ్ ను ఏర్పాటు చేశారు.

అలాగే డేటా గ్రిడ్స్ వ్యవహారంలో సాక్షులు, అనుమానితులను విచారించేందుకు మరో బృందాన్ని నియమించారు. చివరిగా ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారిగా అనుమానిస్తున్న ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్ ను పట్టుకోవడానికి మరో టీమ్ ను ఏర్పాటు చేశారు.

కాగా, అశోక్ లొంగిపోయేందుకు ఇచ్చిన గడువు నిన్నటితో ముగిసిపోవడంతో ఆయన్ను ఏ క్షణమైనా సిట్ అధికారులు అరెస్ట్ చేయొచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఐటీ గ్రిడ్స్ వ్యవహారంలో సమాచారం ఇవ్వాలని గూగుల్, అమెజాన్ సంస్థలకు సిట్ అధికారులు లేఖ రాశారు.
Andhra Pradesh
Telangana
it grids
sit
Police
three teams
Hyderabad
ashok

More Telugu News