Vanaparti: డబ్బు కోసం మహిళ వేషం వేసిన యువకుడు... మోసం చేశావంటూ హత్య చేసిన మరో యువకుడు!

  • 10వ తేదీన వనపర్తి జిల్లాలో హత్య
  • జాతీయ రహదారిపై వేశ్యగా పరిచయం చేసుకున్న అర్జున్
  • మోసపోయానన్న ఆగ్రహంతో హత్య చేసిన మధ్యప్రదేశ్ వాసి

సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో మహిళగా వేషం మార్చుకున్న ఓ యువకుడిని, తన కామవాంఛ తీర్చేందుకు రూ. 400తో బేరం కుదుర్చుకున్న వ్యక్తి, విషయం తెలుసుకుని, తీవ్ర ఆగ్రహంతో దారుణంగా హత్య చేసిన ఘటన వనపర్తి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.

ఈ నెల 10న హత్య జరుగగా, పోలీసులు కేసును ఛేదించిన అనంతరం, ఆసక్తికర వివరాలను జిల్లా ఎస్పీ రెమారాజేశ్వరి మీడియా ముందు ఉంచారు. వీపనగుండ్ల మండలం తూముకుంటకు చెందిన మందా అర్జున్, డబ్బు కోసం అమ్మాయిలా వేషం మార్చేవాడు. కోరిక తీరుస్తానని పురుషులను ఆకర్షించడం, ఆపై అనుమానం వచ్చిన వారికి తానో హిజ్రానని చెప్పడం, ఆపై ఎంతో కొంత డబ్బు తీసుకుని జల్సాలు చేస్తుండటమే ఇతని పని.

ఈ క్రమంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లా ప్రాంత వాసి భరత్ లాల్ రాయ్ పోలేపల్లి సెజ్ లో కార్మికుడిగా పనిచేస్తూ, తన కామవాంఛ తీర్చుకునేందుకు 10వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో జాతీయ రహదారిపైకి వెళ్లి, ఆడవేషంలో ఉన్న అర్జున్ ను చూశాడు. రూ. 400 ఇచ్చేందుకు బేరం మాట్లాడుకుని, అర్జున్ ను తీసుకుని ఆటోలో, సమీపంలోని బూరెడ్డి పల్లి శివార్లకు వెళ్లారు. అక్కడ ఉన్న పొదల్లోకి వెళ్లిన తరువాత భరత్ కు అసలు విషయం తెలిసింది. తనను మోసం చేశావంటూ ఓ రాయితో అర్జున్ తలపై బలంగా మోదిన భరత్, ఆపై అతను ధరించిన చున్నీతోనే గొంతును బిగించి, ఊపిరాడకుండా చేసి, తానిచ్చిన రూ. 400 తో పాటు అతని సెల్ ఫోన్ ను దొంగిలించుకుపోయాడు.

పొలాల్లో యువతి మృతదేహం పడుందని ఫిర్యాదు రావడంతో అక్కడికి వెళ్లిన పోలీసులు, అతన్ని ఓ హిజ్రాగా భావించి, హైదరాబాద్ లో హిజ్రాలు అధికంగా ఉండే ప్రాంతంలో విచారించినా, కేసులో క్లూ సంపాదించలేకపోయారు. చివరకు శంషాబాద్, షాద్ నగర్ ప్రాంతంలో విచారిస్తే, అతని పేరు, సెల్ నంబర్ లభించాయి. ఫోన్ నంబర్ ఆధారంగా విచారణ కొనసాగించగా, మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో ఫోన్ ఉన్నట్టు తెలియగా, అక్కడికి వెళ్లిన పోలీసులు, భరత్ ను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

More Telugu News