Narendra Modi: పారిశుద్ధ్య కార్మికులకు తన వ్యక్తిగత ఖాతా నుంచి రూ.21 లక్షల విరాళం ఇచ్చిన మోదీ

  • గంగానది ప్రక్షాళన నిమిత్తం రూ.1.3 కోట్లు అందజేత
  • ప్రభుత్వోద్యోగుల కుమార్తెల చదువు కోసం విరాళం
  • ‘కన్యా కేలవని నిధి’కి రూ.89.96 కోట్లు

పారిశుద్ధ్య కార్మికుల పాదాలు కడిగి గౌరవించడమే కాకుండా వారిని కర్మయోగులుగా అభివర్ణించిన ప్రధాని మోదీ నేడు తన వ్యక్తిగత ఖాతా నుంచి వారికి విరాళం ఇచ్చారు. కుంభమేళా పారిశుద్ధ్య కార్మికుల నిధికి.. రూ.21 లక్షలను ప్రధాని మోదీ తన వ్యక్తిగత ఖాతా నుంచి విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. గతంలో పలు సందర్భాల్లో కూడా ప్రధాని విరాళాలను ఇచ్చారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో వాటిన్నింటినీ ప్రస్తావించారు.

‘‘ప్రధాని నరేంద్ర మోదీ తన వ్యక్తిగత ఖాతా నుంచి రూ.21 లక్షలను కుంభమేళా పారిశుద్ధ్య కార్మికుల కోసం విరాళం ఇచ్చారు. ఇటీవల మోదీ ఇచ్చిన విరాళాలకు కొనసాగింపుగా ఈ తాజా నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం సౌత్ కొరియాలో సియోల్ శాంతి పురస్కారం కింద లభించిన రూ.1.3 కోట్లను వెను వెంటనే.. పవిత్ర గంగానది ప్రక్షాళన నిమిత్తం ‘నమామి గంగ’ పథకానికి మోదీ విరాళంగా ఇచ్చారు. అలాగే ఇటీవల తనకు అందిన బహుమతులను వేలం వేయగా వచ్చిన రూ.3.40 కోట్లను సైతం నమామి గంగకు ఇచ్చేశారు. అలాగే సూరత్‌లో తన బహుమతులను వేలం వేయగా వచ్చిన రూ.8.33 కోట్లను ‘నమామి గంగ’ పథకానికి విరాళంగా ఇచ్చారు.

మోదీ గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన వ్యక్తిగత ఖాతా నుంచి రూ.21 లక్షలను గుజరాత్ ప్రభుత్వ ఉద్యోగుల కుమార్తెల చదువు కోసం విరాళంగా ఇచ్చారు. అలాగే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన బహుమతులను వేలం వేయగా వచ్చిన రూ.89.96 కోట్లను ఆడపిల్లల చదువు కోసం ఏర్పాటు చేసిన ‘కన్యా కేలవని నిధి’కి ఇచ్చేశారు’’ అని పీఎంవో పేర్కొంది.

More Telugu News