Lakshmi Bhavani: భర్త అనుమానం... తప్పు చేయలేదంటూ యువతి ఆత్మహత్య!

  • ఆత్కూరు మండలం తేలప్రోలులో కలకలం
  • సేల్స్ ఉద్యోగినిగా పనిచేస్తున్న లక్ష్మీ భవాని
  • విధుల్లో భాగంగా పలువురితో మాట్లాడే భవానీ
  • భర్త అనుమానించడంతో ఆత్మహత్య

తనను పెళ్లి చేసుకుని, మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భర్త నిత్యమూ వేధిస్తుండగా, ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆత్కూరు మండలం తేలప్రోలులో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, తేలప్రోలుకు చెందిన అనిల్‌ కు సొంత మరదలు లక్ష్మీభవానీ (24)తో ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. లక్ష్మీభవానీ ఓ కార్ల కంపెనీలో సేల్స్‌ ఉద్యోగినిగా పని చేస్తుండగా, అనిల్‌ లారీడ్రైవర్‌ గా పనిచేస్తూ, ఇద్దరూ కలిసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఈ క్రమంలో లక్ష్మీభవానీ తరచూ ఫోన్‌ లో మాట్లాడుతుండటంపై అనిల్ అనుమానం పెంచుకుని, తరచూ భార్యతో గొడవలు పడుతూ ఉండేవాడు. తన మాటలతో మానసికంగా హింసించేవాడు.

ఇద్దరి మధ్యా వాగ్వాదాలు పెరుగగా, అత్తమామలకు ఫోన్‌ చేసి మీ కూతురు ప్రవర్తన బాగోలేదని, అందుకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని వెల్లడించాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన లక్ష్మీభవానీ, నిన్న తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బంధువులు ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణం దక్కలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించి, అనిల్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తమ అల్లుడు అనిల్, కుమార్తెను హింసించాడని, తన వివాహేతర సంబంధాన్ని కప్పిపుచ్చుకునేందుకు కుమార్తెపై ఆరోపణలు చేస్తున్నాడన్న లక్ష్మి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.

More Telugu News