Andhra Pradesh: ఏపీ స్పీకర్ కోడెల సవాల్ ను స్వీకరిస్తున్నా: వైసీపీ అధికార ప్రతినిధి అంబటి

  • సమయం, స్థలం వెల్లడిస్తే అవినీతిపై చర్చకు వస్తా
  • జగన్ ను విమర్శించే అర్హత, స్థాయి కోడెలకు లేవు
  • స్పీకర్ పదవికి కోడెల అర్హుడు కాదు

అవినీతిపై చర్చకు రావాలన్న ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు సవాల్ ని స్వీకరిస్తున్నట్టు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. సమయం, స్థలం వెల్లడిస్తే చర్చకు వచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. గుంటూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ జగన్ ను విమర్శించే అర్హత, స్థాయి కోడెలకు లేవని, స్పీకర్ పదవికి కోడెల అర్హుడు కాదని దుమ్మెత్తిపోశారు. సభా ముఖంగా కోడెల అవినీతి, అక్రమాలను ఎండగడతానని అన్నారు.

 రాబోయే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలో తెలియక ఏవేవో మాట్లాడుతున్నారని, రాజ్యాంగ పదవిలో ఉండి రాజకీయ విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ఏపీలో వైసీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించాలని చూస్తున్నారని, అందుకే, ఆయా వ్యక్తుల పేర్లపై టీడీపీ నాయకులు దరఖాస్తులు చేశారని ఆరోపించారు. తమ కార్యకర్తలెవ్వరూ ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేయలేదని స్పష్టం చేశారు.

More Telugu News